పంది పిండంలో మానవ కిడ్నీ అభివృద్ధి

పంది పిండంలో మానవ కిడ్నీ అభివృద్ధి

చైనాలోని గ్వాంగ్జౌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. పంది పిండంలో మానవ మూత్రపిండాన్ని అభివృద్ధి చేసారు. గ్వాంగ్జౌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడిసిన్‌ అండ్‌ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి సఫలమయ్యారు. పంది కణాలు, మానవ కణాల కలయికతో చేసిన ఈ మూత్రపిండం 28 రోజుల తర్వాత మానవ మూత్రపిండంగా రూపాంతరం చెందినట్టు పరిశోధనలకు నేతృత్వం వహించిన సీనియర్‌ ప్రొఫెసర్‌ లై లియాంగ్వు తెలిపారు. పరిశోధన ఫలితాలు జర్నల్‌ సెల్‌ స్టెమ్‌ సెల్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనల్లో భాగంగా 1820 పంది పిండాలను సేకరించిన శాస్త్రవేత్తలు.. వాటిలో నుంచి ల్యాబ్‌లో 13 పంది పిండాలను ఎంచుకున్నారు. వాటిలో మానవ ప్లురిపోటెంట్‌ కణాలను ప్రవేశపెట్టారు. మానవ అవయవాల తరహాలో రూపాంతరం చెందే గుణం ఉన్న ఈ కణాలకు రసాయనాల మిశ్రమం కలిపి మూత్రపిండాలను అభివృద్ధి చేశారు. 28 రోజుల అనంతరం చూడగా.. పంది పిండంలో మానవ మూత్రపిండం కనిపించింది. ఈ మూత్రపిండాల్లో 60 శాతం మానవ కణాలు, 40 పంది కణాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు.